తెలుగు కవిత్వంలో రక్తాశ్రువులతో నూతనత్వాన్ని సృష్టించిన అలిశెట్టి
అలిశెట్టి
ప్రభాకర్ జన్మదినం 12, జనవరి
-సిహెచ్
వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్. 9391533339.
తెలుగు
సాహిత్యంలో అజరామరమైన నూతన సాహిత్య విలువలను, సామాన్యుని గొంతుకను బలంగా
వినిపించిన మహనీయుడు, ప్రజల మనిషిగా, జీవితాన్నే సాహిత్యానికి అంకితం చేసిన
చిరుకవితల కవి, మరణించి మూడు దశాబ్దాలయినా, నేటికీ వినబడుతూనే ఉంది. కవిత్వం
గురించి ఎవరు ఎక్కడ మాట్లాడినా, ఆయన పేరు లేకుండా కవిత్వంపై ప్రసంగం చేయలేని
విధంగా, కవిత్వంలో తన ముద్ర వేసిన అతి సామాన్యుడు. ఆయన పేరు వినిపించినంతగా, ఈ
శతాబ్దంలోని ఏ కవి పేరుకాని, ఆయన కవితలు కానీ చర్చల్లో కానీ, ఉదాహరణలో కానీ
పేర్కొన్న కవి మరొకరు లేరంటే, కవితలుకానీ
లేవంటే అతిశయోక్తి కాదు.
ఆడంభరాలకు, సన్మానాలకు, సభలకు, అవార్డులకు అర్రులు
చాచకుండా, తన కాలం, కుంచె ఎప్పటికీ అత్తాడుగువర్గాల ప్రజలు, అణచివేతకు గురైన శ్రామికుల
వెన్నంటే ఉంటుందని ఆచారణతో సహాయ ప్రకటించిన అనన్య ప్రతిభావంతుడు అలిశెట్టి.
పేరులోన ప్రభాకరున్నీ ఉంచుకోవాడమే కాకుండా, ఆ ప్రభాకరునిలోని భాస్వర స్వభావ లక్షణాలను పునికి పుచ్చుకొని, తన
రక్తాన్నే సిరాగా మార్చుకొని, సమాజంలోని
అసంబద్ద సంప్రదాయాలను, కట్టుబాట్లను, రాజకీయాల్లోని కుళ్లును తన అక్షర
యజ్ఞంతో దహించి వేసే ప్రయత్నం చేసిన
అనల్పజీవి అలిశెట్టి ప్రభాకర్ .
తన కంటూ
ఏమి మిగుల్చుకోవాలనే ఆశలు లేకుండా, తన చుట్టూ ఉన్న పేదల బతుకుల పట్ల ఈ సామాజిక,
రాజకీయ వ్యవస్థ, తరతరాలుగా వ్యవహరిస్తున్న తీరును తన ప్రతి కవితలో నిశితంగా విమర్శించారు. అది రాజకీయ నాయకుడైనా,
సమాజంలోని ఇతర పెద్దలైనా, మనిషి సృష్టించాడాని చెప్పుకొనే దేవుడైనా ఒకే రీతిలో
వ్యవహరిస్తున్నారంటూ, సమాజం తనకు తానుగా మేలుకొంటే తప్ప, ఈ సమాజంలోని బడుగుల
బతుకులు బాగుపడవని హెచ్చరించారు.
స్త్రీల పట్ల సమాజ వైఖరిని
కూడా నిశితంగా ఖండిస్తూ, మహిళలను ఈ సమాజం ఆటవస్తువుగా, అంగడి బొమ్మలా
వాడుకొంటున్నారని ఘోషించాడు. రాజ్యాంగాలు మారినా, ప్రభుత్వాలు మారినా, నేటికీ
స్త్రీల పట్ల ఈ సమాజం ఇంకా ఆటవిక యుగం నాటి దృక్పథంతోనే ఉందని, స్త్రీని పురుషుడు
తన అవసరాలకు అనుగుణంగా మలుచుకొని, తన లోని రాక్షసత్వానికి ప్రతీకగా చూస్తున్నారని
ప్రకటించాడు. “విషాద సాక్షాత్కారం” శీర్షికన రాసిన దీర్ఘ కవితలో స్త్రీల బాధలను
వివరంగా ప్రశ్నించారు.
“కన్నీళ్లని ఏ భాషలోకి అనువాదించినా
విషాదం మూర్తీభవించిన స్త్రీయే
సాక్షాత్కరిస్తుంది” అని సిద్ధాంతీకరించారు.
ఇందులోనే
“నాజీల అహం/నగ్నంగా స్త్రీలని ఊరేగించినా/ ఊచకోత
జ్ఞాపకాల్లోంచీ/నాగరికత బ్లూఫిల్మై /బుసకొట్టే కామాకేళీ చిత్రాల్నుంచీ/ కన్నీళ్ళు
ధారాపాతంగా ప్రవహించి / ఘనీభవించే వుంటాయ్” అంటూ మానవ జాతి చరిత్రలో
ఎన్నియుగాలు మారినా, ఎంతమంది శాసనులు మారినా స్త్రీలు ఎదుర్కొన్న సమస్యలు మాత్రం
రూపం మాయచుకొన్నాయే తప్ప వారికి స్వాతంత్ర్యం లభించలేదని పేర్కొంటూ, “ అశ్రు
బిందువునించి/స్త్రీకినకా విముక్తి కాలగలేదంటే/నిజంగా కన్నీరు సముద్రమై/ నిజంగా కన్నీరు సముద్రమంత ఆవేశమై/ఉద్యమాల
హోరెత్తితే గాని/ ఈ దోపిడీ దౌర్జన్యాల భూభాగాన్ని/ముంచెత్తాలేదని “స్పష్టంగా నేటి
దుస్థితిని ప్రకటించారు. అందాల పోటీల గురించి రాస్తూ, “అక్షరాన్నివివస్త్రని గావించి/
అమ్ముకొనే/ఆశలీషా సాహిత్యం నుంచీ .. కన్నీళ్ళు ప్రవహిస్తూనే వుంటాయ్” అంటూ ఆవేదన
చెందారు.
సాహిత్యకారులుగా,
తెలుగు భాషకు తామే ప్రతినిధులుగా చెప్పుకొంటున్న కుహనా మేధావుల గురించి కూడా
కుండబద్దలుకొట్టినట్లు తన అంతరంగాన్ని
వెల్లడించారు. సమసమాజం కొరకంటూ ప్రచారం చేసుకొంటూ, ప్రభుత్వ అవార్డులకొరకు తమవంతు
కృషి చేసుకొంటూ, తమ రచనలలో తీవ్రంగా వ్యతిరేకించిన పెట్టుబడిదారు వర్గాన్ని,
రాజ్యాన్ని, రాజ్యాధినేతలను ప్రసన్నం చేసుకోవడానికి, అవార్డులు పొందడానికి చేసిన శ్రమను
నిరసిస్తూ, అవహేళన చేశారు. అలాంటి వారి గురించి “ అర్భకుడైన కవి ఒకడు/ అవార్డులూ /
సన్మానల కోసం / దేబారించడం తప్ప/ నగరంలో నేడు/ అవాంఛనీయ/ సంఘటనలేవీ జరగలేదు” అని
స్పష్టంగా వరి మనస్తత్వాన్ని, వరైకి ప్రజల పట్ల సమాజంపట్ల ఉన్నదంతా పైపై ప్రేమేనని
చెప్పినట్లుగా, కవితలో చెప్పారు.
సమాజంలో సమానావకాశాలు లేక, చిటికి పోయిన బతుకులను చూసిచూసి విసిగిపోయిన ఆరోషంలో నుండి చూస్తూ, నా కవిత అనే శీర్షికతో రాసిన దాంట్లో “ నా గుప్పిట్లో / మండుతున్న/ ఎన్నో గుండెలు/ ఒక్కో దాన్లో/ దూరి/ వాటిని చీరి / రక్తాశ్రువులు ఏరి/ పరిశీలిస్తాను/ నేను” అంటూ తన సిద్ధాంతాన్ని, విధానాన్ని స్పష్టంగా తెలియజెప్పిన సామాన్య అక్షర యోధుడు అలిశెట్టికి అక్షరాంజలి.



No comments:
Post a Comment